మిశ్రమ స్పందన
బాలికా విద్యకు ప్రోత్సాహం..
మైనారిటీలపై వివక్ష
● జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు కరువు
● జిల్లాకో బాలికల హాస్టల్తో ప్రయోజనం
● కేంద్ర బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు బడ్జెట్ బాగుందంటుండగా.. మరికొందరు పెదవి విరుస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోపాటు వ్యవసాయ రంగానికి కేంద్రం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. రైతుల ఆదాయం పెంచడం, డిజిటల్ అగ్రి స్టాక్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు. అయితే జిల్లా విషయానికి వస్తే ప్రత్యేకంగా కేటాయింపులేమి లేకపోవడంతో పెదవి విరుస్తున్నారు. జిల్లా కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే వంతెనలకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. రింగ్ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వంటి వాటికి ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయి. అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలకు సంబంధించి కీలకమైన కేకేవై రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు ఉన్నా నిధుల కేటాయింపు జరగడం లేదు. జిల్లా కేంద్రాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేరిస్తే నిధులు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నా, బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు.
ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించారు. ఇది బాలికల విద్య అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా సంక్షేమ హాస్టళ్లను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేస్తే బాలికా విద్యకు మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందన్న అభిప్రయాం వ్యక్తమవుతోంది.
కేంద్ర బడ్జెట్ మైనారిటీ ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. బడ్జెట్లో రూ. 3,400 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.50 కోట్లు మాత్రమే పెరిగింది. దేశ జనాభాలో 15 శాతం ఉన్న మైనారిటీలకు ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. రాష్ట్రాలు కేటాయించినంత కూడా కేంద్రం ఇవ్వకపోవడం శోచనీయం. తెలంగాణపై నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
– షబ్బీర్అలీ, ప్రభుత్వ సలహాదారు
మిశ్రమ స్పందన


