ప్రయివేట్ అంబులెన్సుల ఇష్టారాజ్యం
● రోగుల తరలింపులో నిత్యం లొల్లి
● పట్టించుకోని ఆస్పత్రి అధికారులు
బాన్సువాడ: బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రయివేట్ అంబులెన్సుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులను జిల్లా కేంద్రాలకు తరలించడంలో నిత్యం లొల్లి జరుగుతున్నా సంబంధిత వైద్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రయివేట్ అంబులెన్సులు ప్రభుత్వ ఆస్పత్రిలోకి రాకుండా చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నారు. ఈ నెల 8న బాన్సువాడ మండలం బుడ్మి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల ఆటోకు కొల్లూర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా కూలీలకు గాయాలు కావడంతో బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని విధులు నిర్వహిస్తున్న వైద్యులు చెప్పడంతో క్షతగాత్రుల కుటుంబీకులు ఆందోళనకు గురై ప్రభుత్వ అంబులెన్సు కోసం ప్రయత్నించగా అంబులెన్సు మూలనడిందని అక్కడున్న ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో అప్పటికే నాలుగైదు ప్రయివేటు అంబులెన్సులు ఎమర్జెన్సీ వార్డు వద్ద వాలిపోయాయి. క్షతగాత్రులను తమ అంబులెన్సులోనే తీసుకెళ్తామంటూ క్షతగాత్రులను అంబులెన్సు డ్రైవర్లు లాకెళ్లారు. నాదీ..నీదీ అంటూ అంబులెన్సు యజమానులు ఒకరినొకరు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. దీంతో అప్పటికే ఆందోళనలో ఉన్న క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ప్రయివేటు అంబులెన్సు డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక్కొక్కరికి ఏడు నుంచి పది అంబులెన్సులు ఉన్నాయంటే రోగుల నుంచి ఎంత దండుకుంటున్నారో అర్థమవుతుంది. అన్ని వ్యాపారాల కంటే అంబులెన్సుల వ్యాపారం జోరుగా కొనసాగుతుందని పలువురు బహిరంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయం వైద్యాధికారులకు తెలిసినప్పటికి నోరుమెదపడం లేదని వారు పేర్కొన్నారు. ప్రయివేట్ అంబులెన్సులు ఆస్పత్రి ప్రాంగణంలోకి రాకుండా కట్టడి చేయడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు అంబులెన్సుల యాజమానులు, డ్రైవర్ల మధ్య ఘర్షణలు జరిగి పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లిన ఘటనలు ఉన్నాయి. కానీ ప్రయివేటు అంబులెన్సులను నియంత్రించడంలో విఫలమవుతున్నారు.
వారం రోజుల నుంచి ఆస్పత్రి గేటు వద్ద మా సి బ్బందిని ఏర్పాటు చేశాం. ప్రయివేటు అంబులెన్సులను లోపలికి రానివ్వకుండా కట్టడి చేశాం. వరుస క్రమంలో అనుమతి ఇస్తున్నాం. –విజయ భాస్కర్,
ఇన్చార్జి సూపరింటెండెంట్, బాన్సువాడ


