
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 82 దరఖాస్తులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవా రం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డుకు మరమ్మతులు చేయించాలి
ఇటీవల వరదలకు ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరుతూ భిక్కనూర్కు చెందిన గంగుల రవీందర్ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని గిద్ద హరిజనవాడకు వెళ్లేదారిలో ఉన్న దశనామ కుంట కట్ట రోడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారాన్ని చూపాలని వినతిపత్రం సమర్పించారు.

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి