
అండగా ఉంటా
కొడంగల్ లెక్కనే అభివృద్ధి జేస్త..
‘‘ఎన్నడూ లేనంత వరదలతో వాటిల్లిన ఇబ్బందులను చూసి ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడిదాకా వచ్చా. మీకు జరిగిన నష్టాన్ని చూశా. మళ్లీ ఇలాంటి సమస్య ఎదురు కావొద్దు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. అందుకోసం అవసరమైన నిధులు ఇస్తా. అధైర్యపడకండి అండగా ఉంటా’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం.. వరదలతో దెబ్బతిన్న పంటలు, వంతెనలు, ఇళ్లను పరిశీలించారు. బాధితులను కలిసి వారి గోడును విన్నారు. ‘‘మీ కష్టాలు తీర్చడానికే వచ్చా’’నంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ లింగంపేట
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వచ్చిన వరదలతో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్నుంచి హెలీకాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్నారు. లింగంపేట మండలంతోపాటు కామారెడ్డి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అధికారులందరూ సమన్వయంతో ముందుకువెళ్లడంతో ప్రాణనష్టం జరగలేదన్నారు. వరదలు వచ్చిన రోజునే మంత్రి సీతక్క, ఎంపీ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీలకు ఫోన్ చేసి బాధితులకు అండగా ఉండాలని సూచించానన్నారు. వరద సహాయక చర్యల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు కృషి చేశారన్నారు. వరదల్లో పిల్లల పుస్తకాలు తడిచిపోయాయని చెప్పారని, కాంటింజెన్సీ ఫండ్ నుంచి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. అలాగే ఫార్మా కంపెనీలు, బీడీ పరిశ్రమలతో మాట్లాడి వారి సహకారంతో కాలనీవాసులను ఆదుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. ‘‘కంపెనీలు ఇచ్చే సాయం తీసుకోండి, ఇంకా ఏది కావాలన్నా నేను ఇస్తా’’ అని సీఎం అన్నారు.
భోజన నాణ్యతపై యాప్ను వాడుకోండి
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పెట్టే భోజనం నాణ్యత తెలుసుకునేందుకు యాప్ ఉందని, దాని ద్వారా ఫొటో తీస్తే అందులో న్యూట్రిషన్ ఏమేరకు ఉందో తెలిసిపోతుందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. క్షేత్ర స్థాయిలో నాణ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పెట్టే భోజనానికి కూడా యాప్ ను వాడుకోవాలన్నారు. కార్య క్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభు త్వ సలహాదారులు షబ్బీర్అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్రావ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్గాంధీ హనుమంతు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు చందర్, విక్టర్, నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఇంద్రకరణ్రెడ్డి, గడ్డం చంద్రశేఖర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ పాల్గొన్నారు.
కలెక్టరేట్లో అధికారులతో సీఎం దాదాపు గంటన్నర పాటు సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లో మొదట ఫొటో ప్రదర్శనను తిలకించిన అనంతరం భోజనం చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వరదలతో జరిగిన నష్టం, చేసిన పనిని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్, ఎన్పీడీసీఎల్, ఆర్డబ్ల్యూఎస్, వైద్యారోగ్యశాఖ, వ్యవసాయం, నీటి పారుదల శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు చెప్పిన అంశాలను విని, వాటిపై పలు ప్రశ్నలు అడిగారు. యూరియాకు సంబంధించి అధికారుల మధ్య సమన్వయం అవసరం అన్నారు. ఒకేచోట పంపిణీ చేపట్టడం వల్ల వేలాది మంది రైతులు రావడం, తోపులాటలు, ఇబ్బందులు ఏర్పడి ప్రభుత్వం బద్నాం అవుతోందన్నారు. అలా కాకుండా రెండు మూడు గ్రామాలకు కలిపి ఒకచోట పంపిణీ చేస్తే ఇలాంటి సమస్యలు రావన్నారు.
‘‘ఎన్నికల సమయంలో చెప్పినట్లే కొడంగల్తో సమానంగా కామారెడ్డిని చూస్తా.. అభివృద్ధి చేస్తా. ఏ సమస్య ఉన్నా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకురండి. ఆయన సహకారంతో కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇస్తా. కామారెడ్డిలో ఏ కష్టమొచ్చినా ఆదుకునే బాధ్యత నాది’’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
జీఆర్ కాలనీ ముంపు సమస్యకు
శాశ్వత పరిష్కారం చూపుతాం
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
లింగంపల్లి కుర్దు, బూరుగిద్ద,
కామారెడ్డిలలో పర్యటన
వరదలతో దెబ్బతిన్న పంటలు,
వంతెన, రోడ్ల పరిశీలన
బాధితులను ఆదుకుంటామని హామీ

అండగా ఉంటా

అండగా ఉంటా