
నేడే నిమజ్జనోత్సవం ప్రారంభం
● జిల్లా కేంద్రంలో
భారీ శోభాయాత్రకు ఏర్పాట్లు
● జిల్లా నలుమూలల నుంచి
తరలిరానున్న జనం
కామారెడ్డి టౌన్: వినాయక చవితి పండుగతో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న గణపయ్య.. శుక్రవారం గంగమ్మ ఒడిని చేరుకునేందుకు పయనమవనున్నాడు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. శనివారం కూడా కొనసాగనుంది. శోభాయాత్రతోపాటు విగ్రహాల నిమజ్జనానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కేంద్రంలో 400లకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. శోభాయాత్ర ఘనంగా జరుగుతుంది. దీనిని తిలకించడానికి పట్టణవాసులే కాకుండా జిల్లా నలుమూలలనుంచి భక్తులు తరలివస్తారు. టేక్రియాల్ చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
శోభాయాత్ర సాగుతుందిలా..
సిరిసిల్ల రోడ్లోని ధర్మశాల వద్ద శుక్రవారం సాయంత్రం శోభాయాత్ర ప్రారంభం కానుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొంటారు. శోభాయాత్ర సబంధించిన రూట్ మ్యాప్ను అధికారులు విడుదల చేశారు. రైల్వే స్టేషన్లోని యువజన సమాఖ్య వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర ధర్మశాల వద్ద ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి సిరిసిల్లరోడ్ మీదుగా ఇందిరాచౌక్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ వీహెచ్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద మండపాల నిర్వాహకులను సన్మానిస్తారు. అక్కడి నుంచి స్టేషన్రోడ్, సుభాష్రోడ్, తిలక్రోడ్, జేపీఎన్ చౌరస్తా, వీక్లీమార్కెట్ రోడ్, పాంచ్రస్తా, గోపాలస్వామిరోడ్, పెద్దబజార్, రైల్వేబ్రిడ్జి, అంబేడ్కర్ విగ్రహం, నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా టేక్రియాల్ చెరువు వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. చెరువుల్లో వినాయకులను నిమజ్జనం చేస్తారు. కొందరు విగ్రహాలను బాసరకు తీసుకెళ్తారు.
చెరువు వద్ద..
టేక్రియాల్ చెరువు వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మూడు భారీ క్రెయిన్లు, డోజర్ను ఏర్పాటు చేశారు. విగ్రహాలను ఈ క్రేన్ ద్వారా చెరువుల్లో వేసి నిమజ్జనం చేస్తారు. చెరువులోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. చెరువు వద్ద సహాయక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, సీఆర్పీఎఫ్, హోంగార్డులు, పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ అధికారులు శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు. ప్రశాంతంగా శోభాయాత్ర, నిమజ్జనం జరుపుకోవాలని అధికారులు మండపాల నిర్వాహకులను కోరారు.