
త్యాగశీలి ప్రొఫెసర్ జయశంకర్
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రొఫెసర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని రంగాలలో వెనుకబడిన తెలంగాణ సమాజాన్ని చైతన్య పరచడానికి జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. తన రచనలు, ప్రసంగాల ద్వారా సమాజాన్ని తట్టి లేపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా వేలాది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు పాల్గొన్నారు.