
అత్యవసర సేవలు.. అందని ద్రాక్షే
దోమకొండ: దోమకొండలోని క్లస్టర్ ఆస్పత్రిలో 24 గంటల వైద్య సేవలు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు సైతం రాత్రివేళల్లో నిర్వహించకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఆదివారం వైద్యులు రావడం కూడా మానేశారు. రాత్రిళ్లు ఆరోగ్య సమస్య తలెత్తితే, అత్యవసర వైద్య చికిత్స కోసం కామారెడ్డికి వెళ్లాల్సి వస్తోంది. గతంలో ఇక్కడ కు.ని చికిత్సలు నిర్వహించగా జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడే శస్త్రచికిత్సలు జరిగి ముందంజలో ఉండేది. ప్రస్తుతం సాధారణ వైద్య సేవలు మాత్రమే అందిస్తున్నారు.
2006లో 30 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు...
దోమకొండలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 2006లో రూ.1.96 కోట్లతో 30 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు నాలుగు ఉండగా..ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 11 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు గాను ఇద్దరు రెగ్యులర్గా ఉండగా, ఆరుగురు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు హెడ్ నర్సులు అవసరం ఉండగా ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఆస్పత్రిలో 10 మంది స్టాఫ్ నర్స్ పోస్టులుండగా, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక ఫార్మసిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది. డార్క్రూం అసిస్టెంట్ పోస్టులు రెండు ఉండగా, ఒకరు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. ముగ్గురు ఎంఎన్వో పోస్టులు ఉండగా మూడు ఖాళీగానే ఉన్నాయి. పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆస్పత్రిలో సరైన సేవలు అందడం లేదు. దీంతో అత్యవసర కేసులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేయాల్సి వస్తోంది.
ప్రస్తుతం 50 పడకల ఆస్పత్రిగా
మార్చుతూ ఉత్తర్వులు..
దోమకొండలోని క్లస్టర్ ఆస్పత్రి స్థాయిని 50 పడకల ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 పడకల ఆస్పత్రిగా మారితేనైనా వైద్యులు వైద్య సేవలు 24 గంటల పాటు అందుతాయని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
దోమకొండ క్లస్టర్ ఆస్పత్రిలో
24 గంటల వైద్య సేవలు కరువు
తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు
వైద్యులను భర్తీ చేయాలి
దోమకొండలోని 30 పడకల క్లస్టర్ ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంలో వైద్యుల సంఖ్య, సిబ్బందిని పెంచి 24 గంటల పాటు వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్అలీకి, వైద్య విధాన కమిషనర్కు వినతిపత్రం అందించాము. వారు దానికి సానుకూలంగా స్పందించారు.
– తిర్మల్గౌడ్, మాజీ జెడ్పీటీసీ, దోమకొండ
చర్యలు తీసుకుంటాం
ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. ఉన్న సిబ్బందితో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులతో నెట్టుకొస్తున్నాం. 24 గంటల పాటు వైద్య సేవలు అందాలి. ప్రతిరోజూ మధ్యాహ్నం తర్వాత రాత్రిళ్లు కూడా అందుబాటులో ఉండేలా డ్యూటీ డాక్టర్కు విధులు వేస్తున్నాను. 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చూస్తాను.
– వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆస్పత్రి
సూపరింటెండెంట్, దోమకొండ

అత్యవసర సేవలు.. అందని ద్రాక్షే

అత్యవసర సేవలు.. అందని ద్రాక్షే