కాకినాడ క్రైం: ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ల పిలుపు మేరకు, ది కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ బుధవారం మందుల దుకాణాల బంద్ పాటించింది. దీంతో, జిల్లా వ్యాప్తంగా 1,518 మందుల దుకాణాలు మూత పడ్డాయి. అత్యవసర సేవల కోసం నిర్ణీత మందుల దుకాణాలను తెరచి ఉంచారు. అసోసియేషన్ నాయకులు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు చేస్తున్న ఆన్లైన్ ఫార్మసీలు అటు రోగులతో పాటు వ్యాపారులకు కూడా సమస్యగా మారాయన్నారు. నిబంధనలు పాటించకుండా ఆర్డర్ పెట్టిన మందులు పంపిణీ చేయడం రోగుల ప్రాణాలకు ఏమాత్రం సురక్షితం కాదని చెప్పారు. మార్జిన్లపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ పెత్తనాన్ని తగ్గించి, షెడ్యూల్ డ్రగ్స్పై ఇస్తున్న మార్జిన్ను 16 శాతానికి మాత్రమే పరిమితం చేయడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు. చిన్న వ్యాపారుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న ఆన్లైన్, చైన్ ఫార్మసీల కార్యకలాపాలను నియంత్రించాలని, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పెద్ద ఫార్మా కంపెనీలు, ఈ–ఫార్మసీలపై నిబంధనలను అనుసరించి కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.


