అన్నవరం: ఓవైపు ఎండలు మండిపోతున్నా సత్యదేవుని భక్తులు ఏమాత్రం తగ్గేదేలే.. అన్నట్టుగా రత్నగిరికి పోటెత్తుతున్నారు. ఆలయానికి బుధవారం సుమారు 40 వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు, క్యూలు కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 2,200 జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఈ వారాంతం వరకూ రత్నగిరిపై భక్తుల రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఏర్పాట్లను ట్రస్ట్బోర్డు సభ్యులతో కలసి ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పరిశీలించారు. ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నదానం హాలులో శుభ్రత పెరగాలని కొంతమంది భక్తులు ఈఓ దృష్టికి తీసుకువచ్చారు. తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


