ఆటో రోడ్డెక్కితేనే కానీ పొట్ట నిండని పేద కుటుంబం మాది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాలుగు రోజులుగా డీజిల్ కొరతతో నరకం కళ్ల చూస్తున్నాం. బంకుల్లో గంటల తరబడి వేచి ఉండటంతో ఆ ప్రభావం సర్వీసుపై పడుతోంది. రోజుకు 5 లీటర్ల వరకూ డీజిల్ కొట్టించుకొని లోకల్లో 120 కిలోమీటర్ల మేర సర్వీసు చేసుకునేవాడిని. నిర్వహణ ఖర్చులు పోను రూ.800 నుంచి రూ.1,000 చేతిలో ఉండేది. ఇప్పుడు బంకులో డీజిల్ రూ.200కు మించి కొట్టడం లేదు. ఆదాయం సగానికి పడిపోయింది. బంకు వద్ద 50 వాహనాలకు పైనే క్యూలో ఉంటున్నాయి. వంతు కోసం రెండు గంటలు పైనే నిరీక్షించాల్సి వస్తోంది. డీజిల్ సమస్యను తక్షణం పరిష్కరించాలి.
– కడియాల కిరణ్, ఆటో డ్రైవర్, వాకలపూడి, కాకినాడ రూరల్ ●


