దేవీపట్నం/కోరుకొండ: రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం పాండవుల మెట్ట, మునగాల కొండపై పెద్ద పులి తిష్ట వేసిన విషయం తెలిసిందే. అది శుక్రవారం రాత్రి మునగాల కొండపై నుంచి కిందకు దిగి, కోటి గ్రామం వైపు వెళ్లడాన్ని అటవీ శాఖ అధికారులు ట్రాకర్ ద్వారా గుర్తించారు. ప్రస్తుతం ఇది దేవీపట్నం మండలం ఇందుకూరు, ఇందుకూరుపేట మీదుగా మళ్లీ పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. దేవీపట్నం మండలం కొత్తవీధి – బూరుగుబంద గ్రామాల మధ్య ఉన్న దట్టమైన కొండ ప్రాంతంలో ఈ పులి సంచరిస్తున్నట్లు ట్రాకర్ ద్వారా అటవీ అధికారులు శనివారం గుర్తించారు. పెద్ద పులి బూరుగుబంద – కొత్తవీధి కొండపై ఉండడంతో ప్రజలెవరూ ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఇందుకూరు ఫారెస్ట్ రేంజర్ కొండలరావు హెచ్చరించారు. పశువుల కాపరులు సైతం అడవి వైపు వెళ్లరాదని, రాత్రి సమయాల్లో పొలాల వద్ద ఉండరాదని సూచించారు.


