అమలాపురం టౌన్: జిల్లాలో 77 కేసులకు సంబంధించి సీజ్ చేసిన 2,818 కిలోల గంజాయిని విశాఖపట్నం జిందాల్ పవర్ లిమిటెడ్ నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. విశాఖపట్నం జిందాల్ పవర్ ప్లాంట్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనాతో పాటు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు గంజాయి ధ్వంసం చేసిన విషయాలను ఎస్పీ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈగల్ టీమ్ల ద్వారా జిల్లాలో గంజాయి ముఠాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


