● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● 2,800 వ్రతాల నిర్వహణ
● రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి కిటకిటలాడింది. చైత్ర శుద్ధ ఏకాదశి, ఆదివారం సెలవు కలసి రావడంతో సత్యదేవుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వందలాది వాహనాల్లో తరలి వచ్చారు. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు.
రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 2,800 మంది ఆచరించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఏకాదశి సందర్భంగా సత్యదేవునికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు.


