తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో ఏర్పాటు చేస్తున్న సాంకేతిక సౌకర్యాలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. లోవ దేవస్థానానికి గురువారం వచ్చిన ఆయనకు ఈఓ పి.విశ్వనాథరాజు ఆధ్వర్యాన వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్.. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆన్లైన్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కరూర్ వైశ్యా బ్యాంకు అందజేసిన మూడు కియోస్క్లను ప్రారంభించారు. దేవస్థానంలో మూడేళ్లుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇంకా రూ.4.50 కోట్లతో ఎస్కలేటర్లు, రూ.1.60 కోట్లతో 1.5 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయని ఈఓ వివరించారు. ఈ పనులు వేగంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈఓను, ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.మరిడియ్య తదితరులు పాల్గొన్నారు.


