బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమై, వ్యాపార అభివృద్ధికి రూపొందించిన ‘సంపన్న కారి‘ పథకం ఒక వరం లాంటిదని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం పథకం పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. చాలా వ్యాపారాలు ఒక స్థాయి తర్వాత మరింత అభివృద్ధి చెందడానికి సరైన మార్గదర్శకం, ప్రణాళికలు, మార్కెట్పై అవగాహన లేకపోవడం, పెట్టుబడికి వనరులు లేకపోవడం వంటివి అవరోధంగా ఉంటాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రూపొందించిన కార్యక్రమమే ‘సంపన్న కారి’ అన్నారు. రూ.12 లక్షలు పైబడి టర్నోవర్ చేస్తున్న (సర్వీస్ సెక్టార్, మ్యానుఫాక్చరింగ్ సెక్టార్) మహిళా సంఘ సభ్యురాలికి ఒక పద్ధతిగా రూపొందించిన ఇంక్యుబేషన్ సహాయం పూర్తిగా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికై న వారికి కనీసం 18 నెలలు ఇంక్యుబేషన్ సహాయం అందించడంతో పాటూ రూ. లక్ష వరకు గ్రాంట్ లేక రూ.4 లక్షల వరకు సున్నా వడ్డీ సదుపాయం, వ్యాపారపరంగా శిక్షణ, మార్కెట్ అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో అర్హత కలిగిన సంఘ సభ్యులు ఏప్రిల్ 15వ తేదీలోగా వెలుగు మండల మహిళా సమాఖ్య ఆఫీస్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు జి.శ్రీనివాసరావు, అదనపు పథక సంచాలకులు జిలానీ పాల్గొన్నారు.


