వదల బొమ్మాళీ.. | - | Sakshi
Sakshi News home page

వదల బొమ్మాళీ..

Mar 17 2026 7:34 AM | Updated on Mar 17 2026 7:34 AM

మరో మలుపు తిరిగిన పురోహితుని చేతివాటం వ్యవహారం

మొత్తం రూ.58.39 లక్షల రికవరీ అయినా వివాదానికి పడని తెర

ఆరుగురు సిబ్బంది, 18 మంది వ్రత పురోహితులపై చర్యలు

బ్యాంకు అధికారులకు సైతం నోటీసులు

దేవదాయ కమిషనర్‌ ఆదేశాలు

ఉద్యోగులు, వ్రత పురోహితుల్లో ఆందోళన

అన్నవరం: సత్యదేవుని వ్రత విభాగంలో ఓ వ్రత పురోహితుడు చేతివాటం చూపిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ పురోహితుడు కాజేసిన మొత్తం రూ.58.39 లక్షలూ అధికారులు రికవరీ చేయడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడిందని అందరూ భావిస్తున్నారు. కానీ, అక్కడ పడింది ఫుల్‌స్టాప్‌ కాదని, కామాయేనని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తెలిసో.. తెలియకో చేసిన చేసిన తప్పు.. వదల బొమ్మాళీ.. అన్నట్టుగా సంబంధిత బాధ్యులను వెంటాడుతోంది. ఈ అవకతవకలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, వ్రత పురోహితులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంలో స్టేట్‌ బ్యాంక్‌ అధికారులకు కూడా నోటీసులివ్వాలని దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ తాజాగా ఆదేశించారు. ఈ ఆదేశాలు అన్నవరం దేవస్థానంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఏం జరిగిందంటే..

వ్రత పురోహితుల పారితోషికం బిల్లులు తదితర అంశాలను దేవస్థానంలో మరో పురోహితుడు చూసేవాడు. ఈ క్రమంలో 2024 జనవరి నుంచి 2025 నవంబర్‌ వరకూ 22 నెలల పాటు అతడు దశలవారీగా రూ.58.39 లక్షల మేర అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల తనిఖీలో వెల్లడైంది. దీనిపై అతడిని నిలదీయడంతో గత ఏడాది డిసెంబర్‌లో రూ.28.54 లక్షలు జమ చేశాడు. ఆ తరువాత అతడు మరణించడంతో మిగిలిన మొత్తంలో ఆ పురోహితుడి భార్య నుంచి కొంత, అతడి గ్రాట్యుటీ నుంచి మిగిలినది రికవరీ చేశారు. అలాగే, ఆ పురోహితుడి ద్వారా తమ అకౌంట్లలో ఎక్కువ పారితోషికాన్ని జమ చేయించుకున్న 18 మంది వ్రత పురోహితుల నుంచి కూడా దేవస్థానం అధికారులు ఆ మొత్తాలను రికవరీ చేశారు. వ్రతాల సెక్షన్‌లోని సిబ్బందిని కూడా ఇతర సెక్షన్లకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో దేవస్థానానికి కాని, వ్రత పురోహితులకు కాని ఎటువంటి ఆర్థిక నష్టం జరగలేదని, మొత్తం అంతా రికవరీ చేశామని దేవదాయ శాఖ కమిషనర్‌కు ఈఓ గత జనవరిలో నివేదిక పంపించారు. అక్కడితో ఈ వివాదం సమసిపోయినట్టేనని అందరూ భావించారు.

కమిషనర్‌ ఆదేశాలివీ..

● అయితే, ఈ అవకతవకలపై కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ తాజాగా ఆదేశాలు ఇచ్చారు.

● పురోహితుల పారితోషికం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆఫీసు సిబ్బంది ఆరుగురిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీరిలో కొంతమంది ఉద్యోగ విరమణ చేయగా, ఒకరు వచ్చే నెలలో రిటైర్‌ కానున్నారు. తాజా పరిణామాలతో ఆ ఉద్యోగితో పాటు మిగిలిన వారు కూడా తమపై ఏ చర్య తీసుకుంటారోనని ఆందోళన చెందుతున్నారు.

● అలాగే, చేతివాటం చూపిన పురోహితుడు తమ అకౌంట్లకు అధిక మొత్తాలు జమ చేస్తున్నా ఆ విషయాన్ని అధికారుల దృష్టికీ తీసుకు రాకుండా అతడికి సహకరించారనే అభియోగంపై 18 మంది పురోహితులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశించారు. అధికంగా పొందిన మొతాలను తిరిగి దేవస్థానానికి జమ చేసినప్పటికీ మళ్లీ క్రమశిక్షణ చర్యలంటూ కమిషనర్‌ ఆదేశాలివ్వడంపై ఈ 18 మంది వ్రత పురోహితుల్లో ఆందోళన మొదలైంది. దీనిపై వ్రత పురోహిత సంఘం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.

● అంతే కాకుండా.. దేవస్థానం పంపించిన వ్రత పురోహితుల అధికారిక జాబితాను పరిశీలించకుండా.. కేవలం ఆ పురోహితుడు ఇచ్చిన లిస్ట్‌ ఆధారంగా పురోహితుల ఖాతాలకు పారితోషికాలు జమ చేసిన స్టేట్‌ బ్యాంక్‌ అధికారులకు కూడా నోటీసులివ్వాలని కమిషనర్‌ ఆదేశాలివ్వడం దేవస్థానంలో కలకలం రేపుతోంది.

● ప్రతి నెలా పురోహితుల పారితోషికం చెల్లించే ఫైలును, ఆ జాబితాను దేవస్థానం ఆడిట్‌ విభాగం తనిఖీ చేయాలి. కానీ, ఆ విభాగం సిబ్బంది ఆ పని చేయకుండా, జాబితాపై వెరిఫైడ్‌ అని సర్టిఫై చేస్తున్నారని, దీనిపై ఆడిట్‌ సిబ్బందిని సంజాయిషీ అడగాలని కమిషనర్‌ ఆదేశించారు.

చర్యలు తీసుకుంటాం

వ్రత పురోహితుడు చేతివాటం చూపిన రూ.58.39 లక్షలు పూర్తిగా రికవరీ చేశాం. అయితే, ఈ వ్యవహారంలో దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యం, ఆ వ్రత పురోహితునికి మిగిలిన 18 మంది పురోహితులు సహకరించారన్న అభియోగాలున్నాయి. అలాగే, స్టేట్‌ బ్యాంక్‌ అధికారులు సరిగ్గా వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. వీరిపై తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశించారు. అందువలన వారికి నోటీసులిచ్చి తగు చర్యలు తీసుకుంటాం.

– వి.త్రినాథరావు,

కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement