బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యాన కాకినాడలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం సీనియర్ నేత దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ, మహిళా సాధికారత గురించి ప్రగల్భాలు పలికే పాలకులు మహిళా దినోత్సవం నాడే వంట గ్యాస్ ధరలు పెంచారని ఎద్దేవా చేశారు. ఒకవైపు దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలకు కొదవ లేదంటున్నారని, అటువంటప్పుడు ధరలు పెంచాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. యుద్ధం పేరుతో అదానీ వంటి కార్పొరేట్ ఆయిల్ కంపెనీల లాభాల కోసమే ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని విమర్శించి, అధికారం చేపట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో నిలబడాలని అన్నారు. వంట గ్యాస్ ధరలు తగ్గించడానికి కేంద్రంపై టీడీపీ, జనసేన నాయకులు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సీహెచ్ రాజ్కుమార్, నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకట రమణ, నాగాబత్తుల సూర్యనారాయణ, సీహెచ్ వేణు, మేడిశెట్టి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.


