తొలి తిరుపతి.. భక్తజనఝరి
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో శృంగారవల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేకువజాము నుంచే కాలినడకన, వాహనాల్లో తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. పలువురు భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని సుమారు 35 వేల మంది దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,77,300, అన్నదాన విరాళాలు రూ.93,062, కేశఖండన ద్వారా రూ.6 వేలు, తులాభారం ద్వారా రూ.650, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.23,865 కలిపి మొత్తం రూ.4,00,877 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారన్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారితో పాటు ఆలయ ప్రాంగణాన్ని, ధ్వజస్తంభాన్ని పూలమాలలతో విశేషంగా అలంకరించారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. భక్తులకు సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు సేవలందించారు.
రేపటి నుంచి
ప్రత్యేక ఆధార్ క్యాంపులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ కె.కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుని, శంఖవరం, జగన్నాథపురం, జి.మామిడాడ, జగ్గంపేట, పిఠాపురం, గాంధీనగర్, అడ్డతీగల, జగ్గంపేట, ఏపీఎస్పీ, జేఎన్టీయూకే కళాశాల పోస్టాఫీసులలో ఫిబ్రవరి 11వ తేదీ వరకూ ఈ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. ఐదు నుంచి 7, 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు పిల్లలకు తప్పనిసరి ఆధార్ అప్డేట్ ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు.
ప్రయాణికులకు
లగేజీ అందజేత
అన్నవరం: రైల్వే స్టేషన్లో లగేజీ దింపారు. వారు దిగే లోపే రైలు కదిలిపోవడంతో చేసేది లేక తుని వెళ్లిపోయారు. అక్కడి రైల్వే పోలీసులకు విషయం చెప్పారు. వారిచ్చిన సమాచారం మేరకు అన్నవరం రైల్వే పోలీసులు అప్రమత్తమవడంతో ఆ భక్తులకు వారి లగేజీ భద్రంగా అందింది. ఈ సంఘటన అన్నవరం రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. అన్నవరం రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్యాం సుందరరావు కథనం ప్రకారం.. అనంతపురంలో రోల్డ్ గోల్డ్ నగల వ్యాపారం చేసే జి.శ్రీనివాసులు తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం మచిలీపట్నం వచ్చారు. అక్కడ రోల్డ్ గోల్డ్ వస్తువులు కొనుగోలు చేశారు. తరువాత సత్యదేవుని దర్శనానికి శుక్రవారం అర్ధరాత్రి మచిలీపట్నం – విశాఖపట్నం ప్యాసింజర్లో అన్నవరం బయలుదేరారు. శనివారం ఉదయం అన్నవరం స్టేషన్లో స్టేషన్లో రైలు ఆగడంతో లగేజీ దింపారు. అంతలోనే రైలు కదిలిపోవడంతో వారు తుని రైల్వే స్టేషన్కు వెళ్లి, అక్కడ దిగిపోయారు. ఆ లగేజీలో రూ.7,500 నగదు, రోల్డ్ గోల్డ్ నగలు, ఇతర విలువైన వస్తువులు ఉండటంతో వారు తమ లగేజీ అన్నవరం రైల్వే స్టేషన్లో దించేసిన విషయాన్ని తుని జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావుకు తెలియజేశారు. ఆయన అన్నవరం రైల్వే పోలీస్ ఔట్ పోస్టు హెడ్ కానిస్టేబుల్ శ్యాం సుందరరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆ లగేజీని భద్రపరచి, తుని నుంచి అన్నవరం రైలులో వచ్చిన శ్రీనివాసులుకు అప్పగించారు.
తొలి తిరుపతి.. భక్తజనఝరి


