
కొండపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కొండ పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, పెళ్లి బృందాలతో పాటు సెలవు దినం కావడంతో ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఉదయం ఘనంగా ఊరేగించారు.
ఏసీ బస్సులో 10 శాతం రాయితీ
అమలాపురం రూరల్: ఏపీఎస్ ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి హైదరాబాద్కు నడుపుతున్న అమరావతి ఏసీ బస్సు టికెట్ రేట్లలో ఈ నెల 31 వరకూ 10 శాతం రాయితీ ఇస్టున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్టీపీ రాఘవకుమార్ ఆది వారం తెలిపారు. అమలాపురం నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్కు రూ.1,250, బీహెచ్ఈఎల్కు రూ.1,300 ధరతో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అమలాపురం నుంచి రాత్రి 8.30 గంటలకు సర్వీస్ నంంబర్ 2572, హైదరాబాద్ నుంచి రాత్రి 7.45 గంటలకు సర్వీస్ నంబర్ 2573 బయలుదేరుతాయన్నారు. ఈ సర్వీస్ విజయవాడ నుంచి హైదరాబాద్కు నాన్స్టాప్గా నడుపుతున్నామని తెలిపారు.