
కాకినాడలో జాతీయ జూనియర్ మహిళా హాకీ పోటీలు
కాకినాడ సిటీ: వచ్చే నెల 1 నుంచి 12వ తేదీ వరకూ కాకినాడలో జరగనున్న జాతీయ జూనియర్ మహిళా హాకీ చాంపియన్షిప్ పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ పోటీల నిర్వహణపై కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా క్రీడా మైదానంలో ఆస్ట్రోటర్ఫ్ హాకీ ఫీల్డ్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. దీనికి 29 రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు, 200 మంది సహాయక సిబ్బంది హాజరవుతారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా వసతి, భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా శాఖలు చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస కుమార్, ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, హాకీ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి.హర్షవర్ధన్, జాయింట్ సెక్రటరీ బి.రవిరాజు, సెట్రాజ్ సీఈఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
రేషన్ షాపులకు
చేరని బియ్యం
అయినవిల్లి: ప్రతి నెలా ఒకటో తేదీనే రేషన్ బియ్యం లబ్ధిదారులకు చేరేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెల రేషన్ బియ్యం వ్యాన్ల ద్వారా రేషన్ బియ్యం ఇవ్వడం నిలిపేసి పాత విధానంలో డీలర్ల ద్వారా లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వడం ప్రారంభించారు. ఈ నెల మూడోవ తేదీ దాటినా అయినవిల్లి మండలంలోని చాలా వరకూ షాపులకు రేషన్ బియ్యం దిగుమతి కాలేదు. దీంతో రేషన్షాపు యజమానులు చేసేది లేక లబ్ధిదారులను వెనుకకు తిరిగి పంపిస్తున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే ఒకటో తేదీనే రేషన్ బియ్యం ఇంటికి వచ్చేవని, కూటమి ప్రభుత్వం విధానం మార్చడంతో ఇబ్బంది పడుతున్నామని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులకు వెళ్లి అక్కడ తలుపులకు తాళాలు దర్శనమిస్తున్నాయి. దీంతో పలువురు రెవెన్యూ అధికారులకు పరిస్థితి వివరించారు. మండలంలోని 41 రేషన్ షాపులు ఉండగా 30 శాతం షాపులకు మాత్రమే రేషన్ బియ్యం సరఫరా చేసినట్లు చెబుతున్నారు. గోడౌన్లో బియ్య సరఫరా లేకపోవడంతో ఆలస్యం అయిన మాటా వాస్తవమేనని, స్టాకు రాగానే మిగిలిన 70శాతం షాపులకు బియ్యం సరఫరా చేస్తామన్నారు.
వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల
పరిశీలకుల నియామకం
రావులపాలెం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు పరిశీలకులను నియమించినట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి గురువారం తెలిపారు. రావులపాలెం మండలం గోపాలపురంలోని జగ్గిరెడ్డి స్వగృహంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన పరిశీలకుతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఉన్న క్యూఆర్ కోడ్ ప్రతాలను వారికి అందజేశారు. వాటితో చంద్రబాబు ఇచ్చిన మోసపు హామీలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక పరిశీలకులను నియమించి వారి విధివిధానాలను క్లుప్తంగా వివరించారు. మండపేట నియోజకవర్గానికి పరిశీలకులుగా కటకంశెట్టి ఆదిత్య, రామచంద్రపురం – కుడిపూడి శ్రీనివాసరావు, ముమ్మిడివరం – మాత మురళి, అమలాపురం – పేరి శ్రీనివాస కామేశ్వరరావు, పి.గన్నవరం – పెన్మత్స చిన్న భద్రరాజు, రాజోలు– వంటెద్దు వెంకన్ననాయుడు, కొత్తపేట – సిరిపురపు శ్రీనివాసరావును నియమించినట్టు తెలిపారు.
ధనిక, పేద తారతమ్యం తగ్గాలి
అమలాపురం రూరల్: ప్రైవేట్, పీపుల్స్, ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా ధనిక, పేదల మధ్య తారతమ్యం తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు.

కాకినాడలో జాతీయ జూనియర్ మహిళా హాకీ పోటీలు