
వేటకు వేళాయె..
ఉప్పాడ రేవులో వేటకు సిద్ధంగా ఉన్న బోట్లు
కాకినాడ రూరల్/పిఠాపురం: వలలు సరి చేసుకుని, బోట్లు సరి చూసుకుని.. కడలి అలలపై బతుకు పాట సయ్యాటకు గంగపుత్రులు సిద్ధమవుతున్నారు. బంగాళాఖాతంలో మత్స్య సంతతి వృద్ధి చెందేందుకు వీలుగా ఏప్రిల్ 15 నుంచి చేపల వేటపై నిషేధం అమలు చేశారు. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ నిషేధం శనివారం అర్ధరాత్రితో ముగియనుంది. దీంతో, శనివారం అర్ధరాత్రి, ఆదివారం నుంచి సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు ఉద్యుక్తులవుతున్నారు. ఇప్పటికే ఫైబర్ బోట్లలో మత్స్యకారులు బయలుదేరగా.. సముద్రంలో సుదూర ప్రాంత జలాల్లో చేపలు వేటాడే సోనా బోట్ల నిర్వాహకులు కాకినాడ ఏటిమొగ వద్ద ఆదివారం గంగమ్మ తల్లికి పూజలు చేసి, సాయంత్రం బయలుదేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వేట పునఃప్రారంభం కావడంతో తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సందడి నెలకొంది. మాంసాహార ప్రియులు లొట్టలేసుకుని తినే సముద్ర చేపలు, రొయ్యలు, పీతల రుచులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
భృతి.. అందరికీ అందలే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు వేట నిషేధ భృతి రూ.20 వేల చొప్పున ఇస్తామని నమ్మించారు. గత ఏడాది 24,947 మందికి రూ.20 వేల చొప్పున సుమారు రూ.49 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఏ ఒక్కరికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది జిల్లాలోని 4,451 బోట్లకు సంబంధించి 25,752 మంది మత్స్యకారులను గుర్తించారు. వీరికి రూ.51.50 కోట్లకు పైగా భృతి అందించాల్సి ఉంది. అయితే, వివిధ సాకులతో వీరిలో 24,762 మందిని మాత్రమే అర్హులుగా నిర్ధారించారు. మిగిలిన 990 మందిని అనర్హులుగా తేల్చి రూ.19 కోట్లు ఎగ్గొట్టారు. అర్హులుగా గుర్తించిన వారిలో కూడా ఇంకా 1,445 మందికి వివిధ కారణాలతో ఇప్పటి వరకూ వేట నిషేధ భృతి చెల్లించలేదు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ అవ్వకపోవడంతో నిధులు జమ కాలేదని, వీటిలో 1,200 మందివి సరి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపామని, మిగిలిన 245 మంది గ్రామాల్లో లేరని జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు చెప్పారు. ఇదిలా ఉండగా, కొంత మందికి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిందని కూడా సాకుగా చూపిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కాగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన మత్స్యకారులందరికీ నాలుగేళ్ల పాటు నిర్విరామంగా మత్స్యకార భరోసా సకాలంలో అందించారు.
రూ.10 వేల వేట నిషేధ భృతిని రూ.20 వేలకు పెంచామని కూటమి పెద్దలు గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ, గత ఏడాది ఎగ్గొట్టి, ఈ ఏడాది మాత్రమే ఇవ్వడం వలన కూటమి ప్రభుత్వం కూడా ఏడాదికి రూ.10 వేల చొప్పున మాత్రమే ఇచ్చినట్లయ్యింది. రెండేళ్లకు కలిపి రూ.100 కోట్లు పైగా ఇవ్వాల్సి ఉండగా రూ.49 కోట్లు విడుదల చేశారు. అది కూడా ఇప్పటి వరకూ రూ.25 కోట్లు మాత్రమే జమ అయినట్లు మత్స్యకార నాయకులు చెబుతున్నారు.
వేట నిషేధ పరిహారం ఇచ్చారిలా..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో..
మత్స్యకార కుటుంబానికి రూ.4 వేల చొప్పున 2019 వరకూ 22,250 మందికి రూ.8.90 కోట్లు మాత్రమే ఇచ్చారు.
వైఎస్సార్ సీపీ హయాంలో..
అప్పటి వరకూ రూ.4 వేలు మాత్రమే ఉన్న భృతిని రూ.10 వేలకు పెంచారు.
సంవత్సరం లబ్ధిదారులు పరిహారం
(రూ.కోట్లు)
2019–20 23,190 23.19
2020–21 24,587 24.58
2021–22 30,213 30.21
2022–23 21,394 21.39
2023–24 24,147 24.14
వేట నిషేధం కారణంగా ప్రభావితులైన బోటు యజమానులు, కళాసీలు 1,23,531 మందికి 2019–20 నుంచి 2023–24 వరకూ రూ.123.51 కోట్ల మేర మత్స్యకార భరోసా సొమ్ము అందించారు.
గత ఏడాది వేయలేదు.. ఈ ఏడాది ఇవ్వడం లేదు
వేట లేకపోతే మా కుటుంబానికి పూట గడవదు. ఈ రెండు నెలలూ మాకు నరకంలా ఉంది. అయినప్పటికీ ఏదో కష్టపడి కుటుంబాన్ని పోషించుకున్నాం. మాకు అండగా ఉండే మత్స్యకార భృతి గత ఏడాది వేయలేదు. అదిగో ఇదిగో అని సరిపెట్టేశారు. ఈసారి వేస్తారని చూశాను. కానీ, ఇప్పుడు కూడా వేయలేదు. అడిగితే ఏవో కారణాలు చెబుతున్నారు. ఎప్పుడు అడిగినా వేసేస్తామంటున్నారు తప్ప వేయడం లేదు. ఎవరిని అడగాలో, ఎక్కడికెళ్లాలో తెలియడం లేదు. తెలుసున్న వారిని అడగడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మాలాంటోళ్లని ఏడిపించడం ప్రభుత్వానికి మంచిది కాదు. దయచేసి మా డబ్బులు మాకు వేసి ఆదుకోండి.
– బెణుగు స్వామి, మత్స్యకారుడు, కోనపాపపేట, కొత్తపల్లి మండలం
అదిగో ఇదిగో అంటున్నారు
చాలా సంవత్సరాలుగా మా కుటుంబానికి చేపల వేటే ఆధారం. ఏటా చేపల వేట నిషేధం విధించే రెండు నెలలూ మాకు గడ్డు కాలం. ఆ రోజుల్లో ఏ ఆదాయమూ లేక అప్పులు చేసి కుటుంబాన్ని గడుపుకోవాల్సి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు ప్రతి ఏటా కచ్చితంగా మత్స్యకార భరోసా వేశారు. అప్పుడు ఇబ్బంది లేకుండా పోయింది. కానీ గత ఏడాది నుంచి ప్రభుత్వం ఈ డబ్బులు వేయడం లేదు. ఇప్పుడు వేశామంటున్నారు కానీ మాకు రాలేదు. ఎందుకు రాలేదో తెలియడం లేదు. ఎవరినడిగినా చూస్తామంటున్నారు తప్ప డబ్బులు పడటం లేదు. ఇప్పటికై నా ఆ డబ్బులిచ్చి మమ్మల్ని ఆదుకోవాలి.
– నక్కా తాతారావు, మత్స్యకారుడు, కోనపాపపేట, కొత్తపల్లి మండలం
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
మత్స్యకార భృతి ఎవరెవరికి, ఎందుకు రాలేదో పరిశీంచి, తగిన చర్యలు తీసుకుంటాం. అర్హత లేకపోతే ఏవిధంగా లేదనే విషయంపై విచారణ చేస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మత్స్యకార భృతి వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– కృష్ణారావు,
జిల్లా మత్స్యశాఖాధికారి, కాకినాడ

వేటకు వేళాయె..

వేటకు వేళాయె..

వేటకు వేళాయె..