గద్వాల: జిల్లాలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్, వర్షపునీటి సంరక్షణ, వానాకాలం పంటల సాగుపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు అన్ని గ్రామాలు, వార్డుల్లో సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు కలిపి ఓ చోట సభ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఆయిల్పాం సాగు, హార్టికల్చర్, ఫార్మర్ రిజిస్ట్రీ, నానో యూరియా అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటనతో ముగుస్తుందన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా విధులు నిర్వహించే బీఎల్ఓలు ఓటర్ల ఇంటికి వచ్చినప్పుడు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదే విధంగా జనగణనలో భాగంగా చేపట్టిన ఇళ్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఏఓ వీరప్ప ఉన్నారు.
● ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సెస్సీ, ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ, ఇతర కోర్సుల్లో చేరేలా సంబంధిత ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఈఓ విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత, డీఐఈఓ హృదయరాజు తదితరులు ఉన్నారు.
సీఎం పర్యటనకుపకడ్బందీ ఏర్పాట్లు
ధరూరు: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి గూడెందొడ్డి రిజర్వాయర్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, సీఎం పర్యటనలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదే విధంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్ పనులను పర్యవేక్షించారు.


