మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

Apr 11 2026 8:28 AM | Updated on Apr 11 2026 8:28 AM

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం మార్కెట్‌ యార్డు చైర్మన్‌ హనుమంతు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సుభాన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో ఈసారి ఎక్కువగా మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారని చెప్పారు. రైతులు దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 పొంది కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. జిల్లా మార్కెటింగ్‌ అధికారి పుష్ప మాట్లాడుతూ ఒక ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న ధాన్యాన్ని తీసుకరావడానికి ముందే రైతులు టోకెన్‌ తీసుకోవాలని సూచించారు. టోకెన్‌తోపాటు ఏఈఓ ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ జిరాక్స్‌ పత్రాలను అందించాలని చెప్పారు. నియోజకవర్గంలోని ధరూర్‌, గద్వాల, కేటీదొడ్డి, గట్టు, మల్దకల్‌ మండలాల రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ పాల్గొన్నారు.

627 క్వింటాళ్ల వేరుశనగ రాక

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు శుక్రవారం 627 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టంగా రూ.7,399, కనిష్టంగా రూ.4,660, సరాసరిగా రూ.6,299 ధరలు లభించాయి. అలాగే 283 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,121, కనిష్టంగా రూ.5,711, సరాసరిగా రూ.5,809 చొప్పున పలికాయి. 9 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,509, కనిష్టంగా రూ.3,019, సరాసరిగా రూ.6,339 వచ్చాయి. 417 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,456, కనిష్టంగా రూ.1,906, సరాసరిగా రూ.2,226 ధరలు లభించాయి.

సృజనాత్మకతతో

ఆలోచించాలి: వీసీ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త స్టార్టప్‌లను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని ఎంబీఏ, మ్యాథ్స్‌ డిపార్ట్‌మెంట్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఎంబీఏ లాంటి డిపార్ట్‌మెంట్‌లలో చదివిన విద్యార్థులు మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో సులువుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మార్కెటింగ్‌, బ్యాంకింగ్‌, ఇండస్ట్రియల్‌ సెక్టార్‌లలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబులు, కృష్ణయ్య, అర్జున్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

రైతుల సహకారంఅభినందనీయం

కొత్తకోట రూరల్‌: మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పే బాధ్యత రైతులే స్వీకరించాలని నాబార్డ్‌ సీజీఎం ఉదయభాస్కర్‌ అన్నారు. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలో ఉన్న ఓ మామిడి తోటలో మొదటి కాయ కోసి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నాబార్డ్‌, రాంకీ ఫౌండేషన్‌ సహకారంతో మండలంలోని గిరిజన గ్రామాల్లో 450 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చేయడం సంతోషకరమని రాంకీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు రాంరెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగంగా రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సామాజిక బాధ్యతలో భాగంగా రాంకీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పొందేందుకు పేద మహిళలకు కుట్టు మిషన్లు, రైతులకు స్ప్రేయర్లు అందించారు. నాబార్డ్‌ సిబ్బంది, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement