నాగర్కర్నూల్ క్రైం: రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని, ఇందులో భాగంగానే మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర వైద్యసేవలను అందించి ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణలో రూ.23.75 కోట్లు వెచ్చించి.. 50 బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర సేవల విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినా.. హార్ట్ స్ట్రోక్ వచ్చినా, విష జ్వరాలు ప్రబలినా ఇకపై హైదరాబాద్కు పరుగులు తీయకుండా.. స్థానికంగానే మెరుగైన వైద్యం అందించేందుకు ఈ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు వేగవంతంగా చేస్తున్నామన్నారు. అలాగే వైద్యులు, నర్సుల ఖాళీలను భర్తీ చేయడానికి భారీస్థాయిలో నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు.
క్రిటికల్ కేర్ సెంటర్లతో అత్యవసర వైద్యసేవలు
ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం
ఖాళీల భర్తీకి భారీ స్థాయిలో నియామకాలు
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ


