ఎర్రవల్లి: పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించి వ్యవస్థకు మంచిపేరు తీసుకురావాలని పదవ పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. శుక్రవారం బీచుపల్లి పదవ బెటాలియన్లో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ రషీద్ సివిల్ ఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ హాజరై ఆయనకు పూలమాల వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహ్మద్ రషీద్ తన సేవాకాలంలో క్రమశిక్షణ, విధేయత, కష్టపడే స్వభావంతో ఉన్నతమైన విధులు నిర్వహించి మంచి గుర్తింపు పొందారన్నారు. విధి నిర్వహణలో పటాలం సిబ్బందితో కలిసి ఆయన చేసిన సేవలను అభినందించారు. ఇతర సిబ్బంది కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని తమ విధులను అంకితభావంతో నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు రాజు, నర్సింహరాజు, రాజేశం, శ్రీనివాసులు, ఆర్ఎస్ఐ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


