
సంక్షేమ హాస్టళ్లలో నూతన మెనూ
గద్వాల: 2025–26 విద్యా సంత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ–మెట్రిక్ హాస్టళ్లలో కొత్త మెనూ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కొత్త మెనూ పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ–మెట్రిక్ హాస్టళ్లలో 2025–26 విద్యా సంవత్సరానికి కొత్త, పోషకాహార మెనూ అమలులోకి వచ్చిందన్నారు. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి విద్య ఈ మూడు ఒకదానికొకటి విడదీయరాని అంశాలని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య లక్ష్యమని ఆయన అన్నారు. ప్రతివిద్యార్థి శారీరక మానసిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రతినిత్యం ఆహారంలో పోషక పదార్థాలు ఉండేలా కొత్త మెనూను రూపొందించమని తెలిపారు. పిల్లల శ్రేయస్సు దృష్ట్యా ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని వంటశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో వండేప్రతి భోజనం తాజా పదార్థాలతో సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులకు భోజనం సమయానికి అందించాలని అధికారులకు సూచించారు. హాస్టల్ వంటగదులు పరిశుభ్రంగా ఉండేలా పర్యావేక్షించాలన్నారు. నీటివనరులు, నిల్వ ప్రదేశాలు శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యావేక్షణ కొనసాగించాలని ఇక్కడ నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఈకార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్పాష, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ నుషిత, హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.