
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మొత్తం 43 ఫిర్యాదులను నేరుగా కలెక్టర్కు అందించారు. వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. వీటిని వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్కు 21 వినతులు
గద్వాల క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 21 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ శ్రీనివాసరావు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు.
కలెక్టర్కు సన్మానం
గద్వాల: వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం నీతిఅయోగ్ ద్వారా చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా గట్టు మండలం ఆరుకీలక సూచికలలో ఉత్తమ ప్రగతి సాధించింది. దీంతో దేశంలోనే గట్టుకు ఉత్తమ ర్యాంకు రావడంతో గవర్నర్ విష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా రాజ్భవన్లో కలెక్టర్ బీఎం సంతోష్ ఈ నెల 2వ తేదీన అవార్డు అందుకున్నారు. ఈనేపథ్యంలో అవార్డు పొందిన కలెక్టర్ను జిల్లా అధికారులు సోమవారం ఘనంగా సన్మానించారు.
రేపు జాబ్ మేళా
కందనూలు: జిల్లాకేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, శిక్షణ శాఖాధికారి రాఘవేంద్రసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ కేటగిరీల్లో వంద ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని యువతీ, యువకులు 10వ తరగతి, డిగ్రీ, ఫార్మసీ, పాసై 18–35 ఏళ్లలోపు నిరుద్యోగులు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నం.97012 00819 సంప్రదించాలని కోరారు.
పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
కోస్గి రూరల్: కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులలో సీట్లు ఉన్నా యని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని కోరారు.
కాల్వలో జమ్ము
తొలగింపునకు చర్యలు
అమరచింత: భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ప్రదాన ఎడమ కాల్వ నుంచి అమరచింత పెద్ద చెరువుకు సాగునీరు అందడంలో ఆలస్యం అవుతుండటంతో కాల్వలో ఉన్న జమ్మును తొలగించేందుకు ఇరిగేషన్ అధికారులు ముందుకు వచ్చారు. అమరచింత,పాంరెడ్డిపల్లి, పిన్నంచర్ల గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ చెరువులకు సాగునీరు అందడం లేదని విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు విన్నవించాలని మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డికి ఆదివారం కలిసి విన్నవించారు. తమ సొంత డబ్బులను వెచ్చించి జమ్ము తొలగిస్తామని అధికారులకు తెలపడంతో సోమవారం ఇరిగేషన్ అధికారులు కాల్వ వెంట ఎన్ని మీటర్ల పొడవున జమ్ము, ముళ్ళ పొదలు వ్యాపించి ఉన్నాయనే విషయాలను కాల్వ వెంట తిరుగుతూ పరిశీలించారు. త్వరగా జమ్ము తొలగించే కార్యక్రమం చేపడతామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి