ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భువనచంద్ర, దత్తుస్వాముల ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవమూర్తులను ముస్తాబుచేసి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణం జరిపించారు. రాములోరి కల్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి తన్మయం చెందారు. అదే విధంగా అమావాస్య సందర్భంగా బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అంజన్న దర్శనానికి క్యూ కట్టారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్గౌడ్, మేనేజర్ సురేందర్రాజు తదితరులు పాల్గొన్నారు.