గద్వాల క్రైం: వేసవి కాలంలో ప్రజలు వడదెబ్బ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. మంగళవారం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వేసవి నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరగనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి సమాచారం అందిందని, అందులో భాగంగా వైద్యులు, సిబ్బంది రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే, అవసరమయ్యే మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తదితర వాటిని నిల్వ ఉంచుకోవాలన్నారు. ఎవరైన రోగులు, వారికి అందించే వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. వడదెబ్బకు గురైన వారి వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వివరించాలన్నారు. వేసవి ఎండల నేపథ్యంలో అనారోగ్య భారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది తప్పనిసరిగా అవగాహన కల్పించాలని, తరచూ నీరు తాగాలని, చిన్నారులు, వృదు్ధులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయట తిరగకపోవడమే మంచిదని అన్నారు. సమావేశంలో వైద్యులు సంధ్యా కిరణ్మై తదితరులు ఉన్నారు.