
భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని చింతరేవుల గ్రామ శివారులో చేపట్టిన భూసేకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భూ సేకరణ వివరాలు, లేఅవుట్ మ్యాప్, పెగ్ మార్కింగ్ చేసిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జవహార్ నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిదిలోని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పరిదిలో భూసేకరణ సర్వే పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ఏ విధమైన ఆలస్యం లేకుండా త్వరగా పనులు చేయాలని అన్నారు. ప్రతి రోజు ఎంత మేర భూసర్వే జరుగుతోంది, ఎన్ని ఎకరాలు పూర్తయ్యాయి అనే వివరాలు స్పష్టంగా ఉండాలని అన్నారు. సర్వే, పెగ్ మార్కింగ్ పనులను ఒకే సారి జరుపుతూ రైతులను చైతన్యపరిచి వారి సహకారంతో భూ సేకరణను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా ఎక్కడైన సమస్యలు పరిష్కారం కాకపోతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ విషయంలో సర్వే ల్యాండ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పనులను పూర్తి చేయాలని అన్నారు. ఈ భూసర్వే పూర్తి అయితే ఆయకట్టు పెరగడంతోపాటు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నీటి పారుదల శాఖ ఎస్ఈ రహీముద్దీన్, ఆర్డీఓ శ్రీనివారావు, తహసీల్దార్ బైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.