భూపాలపల్లి అర్బన్: విశ్వకర్మల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున తమ వంతు సహకారం అందిస్తూ సంప్రదాయ వృత్తిదారులకు అండగా ఉంటామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ.. విశ్వకర్మ కులసంఘాల ప్రతినిధులు తమ వర్గ సమస్యలు, జనాభా గణాంకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కులవృత్తుల అభివృద్ధిపై జిల్లా స్థాయిలో త్వరలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. కమ్మరి, కుమ్మరి, ఔసలి, వడ్రంగి, శిల్పి తదితర సంప్రదాయ వృత్తిదారుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. జిల్లా కేంద్రంలో విశ్వకర్మ వర్గాల కోసం భవనం, స్థలం, అవసరమైన పరికరాల ఏర్పాటుపై కలెక్టర్తో చర్చించి సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. శిల్పకళ, చేతివృత్తులు, సంప్రదాయ నైపుణ్యాలకు విశ్వకర్మలు ప్రతీకగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సంప్రదాయ వృత్తిదారులకు
అండగా ఉంటాం
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్


