గడ్చిరోలి జిల్లా సిరొంచలో ఘటన
కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ గ్రామంలో చింత చెట్లపై ఏళ్లుగా నివాసం ఏర్పచుకున్న గబ్బిలాలు వారం రోజులుగా వీస్తున్న వడగాలులతో వందల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. కోర్టు ప్రాంగణం, అటవీశాఖ విశ్రాంతి భవనం వెనుక ఉన్న చింతచెట్లపై గబ్బిలాల మరణమృదంగం మోగింది.
గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాల్లోని సరిహద్దులో 46 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చల్లని ప్రదేశం, నీరు లభించక సుమారుగా 400పైగా గబ్బిలాలు మృతిచెంది నేలపై పడ్డాయి. మరికొన్ని గబ్బిలాలు చెట్టుపైనే మృతి చెంది వేళాడుతూ దర్శనమిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. చూసేవారంతా అయ్యోపాపం అంటున్నారు.


