
ఉపాధికి ప్రణాళిక
ఈ ఆర్థిక సంవత్సరం వివరాలు
నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం
2026–27 ఆర్థిక సంవత్సరానికి సిద్ధమవుతున్న కార్యాచరణ
భూపాలపల్లి రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026–27 సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక రూపకల్పనకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అక్కడి ప్రజల సమ్మతంతో పనులు గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియకు ఈ నెల మొదటి వారం నుంచి శ్రీకారం చుట్టిన అధికారులు ఈనెలాఖరులోగా పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. నవంబర్ చివరి నాటికి పనుల లక్ష్యాన్ని నిర్ధారించనున్నారు
వంద రోజుల పని..
పథకంలో భాగస్వాములైన కూలీలందరికీ ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందులో భాగంగా ముందుగా గ్రామాలకు అవసరమైన పనులు గుర్తించడంతో పాటు ప్రజల అంగీకారం తప్పనిసరి కావడంతో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇందులో పనులకయ్యే ఖర్చు వివరాలు తయారుచేసి తీర్మానాలను ఉపాధి హామీ వెబ్సైట్లో పొందుపరిచి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది.
ఇప్పటినుంచే పనుల గుర్తింపు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నేపథ్యంలో 2026–27లో చేపట్టే పనులను ఇప్పటినుంచే గుర్తించనున్నారు. జిల్లాలోని 248 గ్రామ పంచాయతీల్లో ఈ నెలాఖరులోపు గ్రామసభలు పూర్తిచేసి నవంబర్లో మండలాల వారీగా ప్రణాళిక తయారుచేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపించనున్నారు. వాటిని క్రోడీకరించి రాష్ట్రస్థాయిలో ఆమోదానికి ప్రతిపాదిస్తారు.
వ్యక్తిగత అభివృద్ధి పనులకు ప్రాధాన్యం
అడిగిన వారికి పని కల్పించే లక్ష్యంతో అమలుచేస్తున్న ఉపాధిహామీ పథకం నిర్వహణ ఇకనుంచి గ్రామం యూనిట్ వ్యక్తిగత అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఉపాధి పనులు జిల్లా యూనిట్గా తీసుకొని నిర్వహిస్తుండగా.. ఒక గ్రామంలో పనులు ఎక్కువగా.. మరో గ్రామంలో తక్కువగా జరుగుతున్నాయి. పథకం ఉద్దేశం ప్రకారం పని అడిగిన 14 రోజుల్లోగా పని కల్పించాల్సి ఉంది. ఎన్ఐసీ సాఫ్ట్వేర్ వివరాలు నమోదైతే పని కల్పించాల్సిందే.. లేదంటే నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది.
పనిదినాల లక్ష్యం 12.43 లక్షలు
ఇప్పటివరకు పూర్తయినవి 7.61 లక్షలు
కూలీలకు చెల్లింపులు రూ.35.80 కోట్లు
జాజ్కార్డులు 1,98,060
కూలీల సంఖ్య 2,39,070
ఇప్పటికే గ్రామసభలకు శ్రీకారం
స్థానికుల సమ్మతితో పనుల గుర్తింపు
కొనసాగుతున్న ప్రక్రియ
పథకం ద్వారా సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠదామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వనమహోత్సవం, పల్లె క్రీడా మైదానాలు వంటి పనులు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు, కట్టుకాల్వల పనులు చేపట్టనున్నారు. ఈసారి భూగర్భజలాలు పెంచేలా ఇంకుడు గుంతలు, పంట కాల్వలు, మట్టిదారులు, కందకాల తవ్వకాలు, పశువుల పాకల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు..
ఉపాధి హామీ పథకంలో భాగంగా వచ్చే ఏడాది చేపట్టే పనుల్లో నీటి సంరక్షణ పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. వ్యవసాయ అనుబంధ మొక్కల పెంపకం, వ్యక్తిగత అభివృద్ధి పనులు, పశువుల కొట్టాల నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్మాణం, కోళ్లఫాం ఏర్పాటు, ఫిష్పాండ్ పనులకు ప్రాధాన్యం కల్పించాలి. గ్రామసభల అనంతరం నివేదిక రూపొందిస్తాం.
–బాలకృష్ణ, డీఆర్డీఓ

ఉపాధికి ప్రణాళిక

ఉపాధికి ప్రణాళిక