
ఉద్యానవన పంటల సాగుతో అధిక దిడుబడి
ములుగు రూరల్ : ఉద్యానవన పంటల సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని ఉద్యానవనశాఖ జిల్లా అధికారి సంజీవరావు సూచించారు. శుక్రవారం మండలంలోని అంకన్నగూడెం గ్రామంలో శాఖ రైతులకు అందజేస్తున్న వివిధ రాయితీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇందిర సౌర గిరి జల వికాస్ పథకం ద్వారా ఆయిల్పామ్, పండ్ల తోటలు, పూలసాగుపై రాయితీ లభిస్తోందని వివరించారు. ఎంఐడీహెచ్ పథకం ద్వారా పండ్లు, కూరగాయల సాగులో 50శాతం రాయితీ, మల్చింగ్, పందిరి కూరగాయల సాగుకు రాయితీ వర్తిస్తోందని తెలిపారు. ఆయిల్పామ్ సాగుచేసే రైతులు రూ.20 చెల్లిస్తే మొక్కలు అందజేస్తామని, అంతర పంట సాగుకు రూ.4,200లు యజమానికి అందిస్తుందని అన్నారు. 5ఎకరాల లోపు ఉన్న రైతులకు 90శాతం రాయితీ, అంతకుపైన ఉన్న రైతులకు 80శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 100శాతం రాయితీ బిందు సేద్యానికి అందిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉద్యానవనశాఖ అధికారి శ్రీకాంత్, విస్తరణ అధికారి రమేష్, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు హేమంత్రెడ్డి, నవీన్ నాయక్, జగదీశ్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు దేవేందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
జిల్లా అధికారి సంజీవరావు