
రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి
భూపాలపల్లి అర్బన్: నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు సమర్థవంతంగా, లక్ష్యాలను చేరుకునే విధంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులకు సూచించారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ రెవెన్యూ సదస్సులపై రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆర్డీఓ రవి, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూకు సంబంధించిన సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మండలాల వారీగా తయారుచేసిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, సదస్సులపై అన్ని మండలాలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రతి మండలంలో ప్రజల సమస్యలు, భూ సంబంధిత వివాదాలు, పట్టాదారుల రికార్డులు, జనరల్ రెవెన్యూ పనితీరు మొదలైన అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని సమీక్షించాలన్నారు. ప్రతి దరఖాస్తు పక్కాగా రిజిస్టర్లో నమోదుచేయాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో రెవెన్యూశాఖ కీలకపాత్ర పోషిస్తున్నందున, ఈ సదస్సులు విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ముందస్తుగా టామ్ టామ్ ద్వారా ప్రచారం చేయాలన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ