
అంధకారంలో అమ్మవారు
కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాలు ముగిసిన తర్వాత అధికారుల నిర్లక్ష్యంతో సరస్వతీ ఘాటులో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. కనీసం విద్యుత్ దీపాలు, ఐమాస్ట్ లైట్లు, వీధి దీపాలు కూడా వెలగకుండా తొలగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దారిపొడవునా విద్యుత్ దీపాలు కూడా లేవు. సరస్వతీ మాత అమ్మవారి విగ్రహం కూడా చిమ్మచీకట్లో ఉండడంతో రక్షణ లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. రాత్రి వేళల్లో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇటీవలనే టెంట్సిటీ వద్ద దొంగలు పడి ఏసీలు, కూలర్లు దొంగిలించుకుపోయిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు వెలగేలా చర్యలు తీసుకొని, విగ్రహం వద్ద సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.