జనగామ: అంతరించిపోతున్న పౌరాణిక పద్య నాటక కళను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శ్రీ వెంకటేశ్వర కళాపరిషత్ జనగామ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణరాయబారం పద్యనాటక ప్రదర్శన నిర్వహించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో కళా పరిషత్ గౌరవ సలహాదారు, గౌతమ్ మోడల్ స్కూల్ డైరెక్టర్, మోతే సురేందర్రెడ్డి పర్యవేక్షణలో నాటక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాటక సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, పోతన కళాపీఠం అధ్యక్షుడు జె.ఎన్.శర్మ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాంకేతికతకు విద్యార్థులు దగ్గరవుతున్న ప్రస్తుత తరుణంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలను వారికి పరిచయం చేయడం అవసరమన్నారు. శ్రీ కృష్ణ రాయబారం వంటి నాటకాలు వినోదంతో పాటు ధర్మం, సత్యం, నీతి, బాధ్యత, దేశభక్తి, మానవతా విలువలను తెలియజేస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ డి.లవకుమార్, కన్నా పరశురాములు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రధానాచార్యుడు ఎ.నరసింహులు, ఎనగందుల భిక్షపతి, శ్రీ వెంకటేశ్వర కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు అయ్యప్పశాస్త్రి, అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నాగరాజు శర్మ, కోశాధికారి రాజనరసింహులు, అంజనేయ శర్మ, శ్రీనివాస్, రమణారెడ్డి, సా ంబమూర్తి, విష్ణుచరణ్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో పద్య నాటక ప్రదర్శన
నాటకాలతో భారతీయ సంస్కృతి భావితరాలకు పరిచయం: వక్తలు


