జనగామ: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో శుక్రవారం స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. యువత, క్రీడాకారులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారని జిల్లా యువజన, క్రీడల అధికారి నరసింహారావు తెలిపారు.
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగాన్ని మరింత చురుకుగా మార్చేందుకు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఐదు జిల్లాలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఐదు జిల్లాలకు చైర్మన్లు వీరే..
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం హనుమకొండ జిల్లా చైర్మన్గా ఆరూరి సాంబయ్య, వరంగల్ జిల్లాకు చిలువేరు శ్రీనివాస్, జనగామకు చేపూరి వినోద్, మహబూబాబాద్కు తిప్పర్తి శ్రీధర్, ములుగు జిల్లాకు మట్టెవాడ తిరుపతిలను నియమించారు. జాబితాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నియమించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్(ఏజీపీ) నియామకానికి అర్హులైన న్యాయవాదుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అనుభవం, అర్హత పత్రాలు, ఇతర వివరాలతో తమ దరఖాస్తులను నిర్ణీత గడువు తేదీ ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు బార్ కౌన్సిల్ లేదా కలెక్టరేట్ కార్యాలయ అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఫ్లై ఓవర్పై
పూలకుండీల తొలగింపు
జనగామ: జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ ఫుట్పాత్పై రెండు వైపులా ఏర్పాటు చేసిన పూల కుండీలను మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు పూర్తిగా తొలగించారు. పూల కుండీల ఏర్పాటుతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు తరుచూ ప్రమాదాలు సైతం జరిగాయి. అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. దీనిపై సాక్షి గతంలో రాసిన కథనాలతో వారం రోజుల క్రితమే కుండీల తొలగింపు ప్రక్రియను మొదలు పెట్టారు. కుండీలు తొలగించడంతో ఫుట్పాత్ పూర్తిగా ఖాళీ అయింది. దీంతో కాలినడకన వెళ్లే ప్రజలతో పాటు వాహనదారుల రాకపోకల్లో ఇబ్బందులు తొలగిపోయాయి.
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
జనగామ రూరల్: 2026–27 విద్యా సంవత్సరంలో కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వ, ఎయిడెడ్ సంస్థల్లో చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు తెలంగాణ ఈ–పాస్ పోర్టల్ https://telanganaepass.cgg.gov.in ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో నమోదు చేసుకోవాలని సూచించారు. మార్చి–2026లో పదో తరగతి ఉత్తీర్ణులై 7.0 జీపీఏ లేదా అంతకంటే ఎక్కువ సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. 10వ తేదీన ఎంపిక జాబితా ఉండగా, 12న ధ్రువపత్రాల పరిశీ లన, అలాట్మెంటు జరుగుతుందన్నారు.


