కొడకండ్ల: మండలకేంద్రంలో అక్రమంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల వాడకంపై శనివారం ఎన్ఫోర్స్మెంట్ డీటీ లక్ష్మణ్నాయక్, ఎస్సై చింత రాజు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మండలకేంద్రంలోని హోటళ్లు, చికెన్ సెంటర్లు, బేకరీల్లో వారు తనిఖీలు నిర్వహించి వ్యాపార అవసరాల కోసం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను వాడకుండా సబ్సిడీ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి 20 సిలిండర్లను స్వాధీనం చేసుకొని 15 మంది వ్యాపార యాజమానులపై ఈసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీటీ, ఎస్సైలు మాట్లాడుతూ.. సబ్సిడీ సిలిండర్లను దుర్వి నియోగం చేసే వారితో పాటు బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై నిరంతరం నిఘా పెడుతూ చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్సై కత్తి రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
7న విద్యుత్ ఆర్టిజన్
ఉద్యోగుల మహా ధర్నా
హన్మకొండ: సమస్యల పరిష్కారానికి ఈనెల 7న హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను ఆర్టిజన్ ఉద్యోగులు, ఆన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, పీస్ రేట్ వర్కర్లు విజయవంతం చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ట్రాన్స్ కో రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేశ్ పిలుపునిచ్చారు. ఈలోగా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు జేఏసీతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఈ నెల 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఆయన శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, తెలియజేయడం ద్వారా ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధి అన్ని అల్టాసౌండ్ స్కానింగ్ సెంటర్లు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్తోనే పనిచేయాలని, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ జరిగినట్లు గమనిస్తే పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100, ఎస్.బీ 87126 85257 కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
ఈఎస్ఐ ఆస్పత్రిలో
టెండర్లకు ఆహ్వానం
కాశిబుగ్గ: వరంగల్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇన్పేషెంట్లు, డ్యూటీ డాక్టర్ల ఆహారం సరఫరా కోసం ఇ–టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కాంతిప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ దరఖాస్తులను ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు సమర్పించవచ్చ ని సూచించారు. అదేవిధంగా ఈఎస్ఐ ఆస్పత్రి వరంగల్ నుంచి వివిధ డిస్పెన్సరీలకు మందులు, వైద్య వినియోగ వస్తువుల రవాణా కోసం అద్దె వాహనానికి ఇ.టెండర్ ప్రకటిస్తున్నట్లు, ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.


