లింగాలఘణపురం: ‘పాఠశాల పరిసరాలు బాగున్నాయి..ఆవరణ అంతా శుభ్రంగా ఉంది..విద్యార్థులకు బోధన కూడా బాగా చేయాలి’ అని ఉపాధ్యాయులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మండలంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం వంటశాలను సందర్శించి వంట సామగ్రి, గుడ్లు, కూరగాయలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ముఖ్యంగా గణితంపై తగిన ప్రశ్నలు బోర్డుపై రాసి సమాధానాలు అడిగారు. కంప్యూటర్ గదిని, స్టాఫ్ రూమ్ను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో హైమాస్ట్ లైట్లు రావడంలేదని తెలియడంతో మరమ్మతులు చేయించాలని చెప్పారు. గణితంపై విద్యార్థులకు తగిన విధంగా బోధన చేయాలని స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణకు సూచించారు.
కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్
ఆకస్మిక తనిఖీ


