జనగామ: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లను పెంపొందించేందుకు పురపాలక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పురపాలక కమిషనర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి సర్క్యులర్ జారీ చేశారు.
1 నుంచి అందుబాటులోకి..
2026 ఏప్రిల్ 1 నుంచి ఇదే నెల 30 వరకు ఆస్తి పన్ను చెల్లించే యజమానులకు 5శాతం రాయితీ వర్తిస్తుంది. సమయానికి పన్ను చెల్లింపులను ప్రోత్సహించడం, ఆదాయ వసూళ్లను పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ రాయితీని అమల్లోకి తీసుకొచ్చింది. దీనిపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రాయితీ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రతి మున్సిపాలిటీలోనూ పన్ను మేళాలను నిర్వహించాలని పేర్కొన్నారు. పన్ను చెల్లింపులను మెరుగుపరచేందుకు కమిషనర్లు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
జనగామలో 15,847 అసెస్మెంట్లు
జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం మిక్స్డ్, నాన్–రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ కలిపి మొత్తం 15,847 అసెస్మెంట్లు ఉన్నాయి. రాబోయే 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.3.80 కోట్ల మేర డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ ఆస్తిపన్ను చెల్లించేందుకు ఉత్సాహంగా ఉన్న యజమానులకు ప్రభుత్వం ప్రకటించిన 5శాతం రాయితీ శుభవార్తగా మారింది.
పన్ను వసూళ్లలో పెరుగుదల సాధించడంతో పాటు రెవెన్యూ పరంగా మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అభివృద్ధికి ముందడుగుగా భావిస్తున్నారు. ప్రతీ సంవత్సరం వసూళ్లు 100శాతం లక్ష్యానికి చేరుకోవడంలో ఇలాంటి స్కీంలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రభుత్వ ఉద్దేశ్యం.
స్టేషన్లో రూ.1.13కోట్ల డిమాండ్
జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 6,452 అసెస్మెంట్లు ఉండగా, 2026–27 డిమాండ్ రూ.1.13కోట్ల మేర ఉంది. ప్రభుత్వం ప్రకటించిన 5శాతం రాయితీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా పురపాలిక అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
2026–27
ఆర్థిక సంవత్సరంలో అవకాశం
ముందస్తు చెల్లింపుదారులకు
ప్రయోజనం
జనగామ మున్సిపాలిటీ డిమాండ్
రూ.3.80కోట్లు
15,847 అసెస్మెంట్లు..
స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో
రూ.1.13కోట్ల డిమాండ్


