● మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్
జనగామ: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అన్నారు. గురువారం ప్రజాపాలనలో భాగంగా 22వ వార్డులో నిర్వహించిన సభలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు వారికి ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అర్జీలు స్వీకరించేందుకు వార్డు స్థాయి సభలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, పలు శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
మెడికల్ షాపు అనుమతుల తాత్కాలిక రద్దు
జనగామ: పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్లో ఉన్న మెడ్ప్లస్ ఫార్మసీ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లు జిల్లా డ్రగ్ అధికారి బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల మెడ్ప్లస్ పార్మసీని తనిఖీ చేసినట్లు చెప్పారు. తమ పరిశీలనలో ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం–1940 ప్రకారం ఉన్న నిబంధన 65ను ఫార్మసీ పలుమార్లు ఉల్లంఘించినట్లు స్పష్టం చేశారు. కొనుగోలు బిల్లుల నిర్వహణ, రికార్డుల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీ నివేదికను ఔషధ నియంత్రణ విభాగం సహాయ సంచాలకులు, వరంగల్ వారికి పంపించగా, అక్కడ పరిశీలించి మెడ్ప్లస్ ఫార్మసీ ఔషధ విక్రయ అనుమతులను తాత్కాలికంగా సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకున్నారన్నారు.
గంగాపూర్లో మద్యపాన నిషేధం
బచ్చన్నపేట : మండలంలోని గంగాపూర్ గ్రామంలో ఈనెల 10 నుంచి మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు సర్పంచ్ జిల్లెల్ల భాస్కర్ రెడ్డి ప్రకటించారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో మెజార్టీ ప్రజల ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మద్యం విక్రయించిన వారికి పంచాయతీ ఆధ్వర్యంలో రూ.50 వేల జరిమానా, మ ద్యం విక్రయిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే రూ.5వేల నజరాన అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జిలుకర కుమారస్వామి, వార్డు సభ్యులు అనసూయ, రాధిక,, రవళిక, మమత, కవిత, భారతమ్మ, తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్ రెడ్డి పాల్గొన్నారు.
మొక్కజొన్న కోసే యంత్రంలో పడి రైతుకు తీవ్రగాయాలు
పాలకుర్తి టౌన్: మొక్కజొన్న కోసే యంత్రంలో పడి గురువారం ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని తీగారం గ్రామానికి చెందిన రైతు చెన్నూరి చంద్రమౌళికి మొక్కజొన్న కోస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని ఆసుపత్రికి తరలించారు.


