● వీసీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సీఎస్ రామకృష్ణరావు
జనగామ రూరల్: 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2వ తేదీన జరగనున్న గ్రామసభలను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంగళవారం, హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో 99 రోజుల ప్రజాపాలనపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమావేశానికి హాజరయ్యారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 2న నిర్వహించే గ్రామ సభల్లో ప్రతీ అంశం స్పష్టంగా తెలపాలని, ముఖ్యంగా ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి, వారిచే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామ సభలను నిర్వహించి, సంక్షేమ పథకాలను వివరిస్తామన్నారు. ఈ మేరకు 2న జరిగే గ్రామ సభల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, జెడ్పీ సీఈఓ మాధురి షా, డీపీఓ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


