● భారీ వర్షంతో తడిసిన మక్కలు
● జనగామ మార్కెట్లో వరదకు
కొట్టుకుపోయిన గింజలు
● కన్నీటి పర్యంతమైన రైతులు
జనగామ: దంచికొడుతున్న ఎండలకు తోడు..అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి మద్దతు ధరకు మక్కలు అమ్ముకుందామని మార్కెట్కు వస్తే అరిగోస పడుతున్నారు. మార్క్ఫెడ్ శాఖ నిర్లక్ష్యం మూలంగా సకాలంలో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో.. తక్కువ ధరకు ప్రైవేటులో అమ్ముకోవాల్సి వస్తోంది. మంచి ధర కోసం ఎదురుచూస్తున్న సమయంలో అకాల వర్షాలు పెట్టుబడులు సైతం రాకుండా చేస్తున్నాయి. మంగళవారం ఉదయం కురిసిన వర్షంతో జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వందలాది బస్తాల మక్కలు తడసి ముద్దయిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో పలువురు రైతులకు చెందిన సుమారు 5 బస్తాల వరకు గింజలు కొట్టుకుపోవడంతో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మక్కలు తడిసి, గింజలు కొట్టుకు పోతున్న సమయంలో వా టిని ఒడిసి పట్టుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. వర్షసూచన ఉండే అవకాశం ఉందని వాతా వరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మక్కలను ఒక్కచోటకు చేర్చి టార్పాలిన్ కవర్లను కప్పడంతో.. అప్పటికే తడిసి ఉండడంతో మొలకెత్తే ప్రమాదం ఉంది. వెంటనే మార్క్ఫెడ్ కేంద్రాన్ని ప్రారంభించి తడిసిన మక్కలను సైతం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


