బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
గుముడెల్లి రేణుకకు ఘన నివాళి
7
● కడవెండిలో విప్లవ రచయిత మిడ్కో మొదటి వర్ధంతి సభ
● హాజరైన ప్రజాసంఘాలు, విరసం, మాజీ మావోలు
దేవరుప్పుల : ఏడాది క్రితం కగార్ ఆపరేషన్లో నేలకొరిగిన మావోయిస్టు అనుబంధ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు, విప్లవ రచయిత గుముడెల్లి రేణుక అలియాస్ మిడ్కో అమరత్వ స్మరణతో ఉద్యమాల ఖిల్లా కడవెండి మరోసారి ఎరుపెక్కింది. మంగళవారం మండలంలోని కడవెండిలో గుముడెల్లి రేణుక అలియాస్ మిడ్కో ప్రథమ వర్ధంతి తల్లిదండ్రులు సోమయ్య, జయమ్మ సమక్షంలో నిర్వహించారు. ఈ వర్ధంతికి అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి అధ్యక్షత వహిచంగా పలువురు స్మారక స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, అరుణోదయ గాయకురాలు విమలక్క, విరసం నేత పాణి మాట్లాడుతూ.. రేణుక ఉన్నత జీవితం వదిలి ప్రజాసమస్యల పరిష్కారానికి పుస్తకాల్లో మిరుగుడుపూవు(మిడ్కో)గా అటవీబాట పట్టి వెనుకంజవేయలేదన్నారు. ఓ మహిళగా అనేక పోరాట రూపాల్లో సమాజ స్థాపన కోసం పాటుపడుతుంటే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరిట పొట్టన బెట్టుకుందన్నారు. రేణుక భౌతికంగా మనలో లేకున్నా ఆమె రచనలు దేశ విప్లవోద్యమానికి వేగుచుక్కగా మారిందన్నారు. అనంతరం పద్మకుమారి మాట్లాడుతూ నక్సల్ ఉద్యమంలో నేటికి ఇరవై వేల మంది నేలకొరగగా ఆ కుటుంబాలకు బాసటగా నిలుస్తామన్నా లొంగుబాటు నేతల భరోసా తమకు అవసరం లేదన్నారు. అమరుల ఆశయాల సాధనకు వారి వైఖరి వెలిబుచ్చాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు, గాయకులు మిడ్కో త్యాగాన్ని గుర్తు చేసేలా కవితలు, పాటలు ఆలోచింపజేశాయి. విరసం ప్రతినిధి పాణి, సామాజిక ఉద్యమకార్యకర్త సజయ్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, సీనియర్ జర్నలిస్టులు భరద్వాజ్, రమాసుందరి, కుటుంబ సభ్యులు జీవీకే ప్రసాద్, రాజశేఖర్ పాల్గొన్నారు.


