జనగామ: జిల్లాలో తెల్ల రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీకి ఈనెల 1న (బుధవారం) శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంబంధిత రేషన్ దుకాణాలకు అవసరమైన బియ్యం సరఫరా చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 2026 వరకు మూడు నెలల బియ్యం లబ్ధిదారులకు అందించేందుకు సర్వం సిద్ధం చేశారు.
5.64లక్షల యూనిట్లు..10.752 మెట్రిక్ టన్నులు
జిల్లాలో 355 రేషన్ దుకాణాలు ఉండగా, 1,87,002 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు 10,823కు గాను 30,461మంది లబ్ధిదారులు (యూనిట్లు) ఉన్నారు. వీరికి 1,136.415 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరముంది. తెల్లరేషన్ కార్డులు 1,76,094 (5,34,105 యూనిట్లు) ఉండగా 9,613.890 మెట్రిక్ టన్నుల భారీ మొత్తంలో బియ్యం పంపిణీ చేయనున్నారు. 85 అన్నపూర్ణ కార్డుల పరిధిలో 91 మంది యూనిట్లకు 2.550 మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరు చేశారు. మూడు కేటగిరీల కార్డులు 1,87,002 కార్డులు ఉండగా, 5,64,657మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వం వారందరికీ 10,752.855 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించింది. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఈ భారీ పరిమాణంలో బియ్యం రేషన్ దుకాణాలకు తరలించారు. కార్డుదారులు వచ్చి తీసుకునే విధంగా దుకాణాల వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సంబంధిత శాఖల అధికారులు స్పష్టం చేశారు.
రవాణా ఇబ్బందులు లేకుండా..
సాధారణంగా నెల నెలా పంపిణీ జరిగే బియ్యాన్ని ఈసారి ఒకేసారి మూడు నెలలకు ఇచ్చే విధానం వల్ల, లబ్ధిదారులు రవాణా ఇబ్బందులు లేకుండా ముందుగానే నిల్వ చేసుకునే అవకాశం కలగనుంది. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఈ నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది. జిల్లాలో మొత్తం పంపిణీ ప్రక్రియను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మూడు నెలల బియ్యం పంపిణీకి జిల్లాలో అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో, ఏప్రిల్ 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు సులభతరంగా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
జిల్లాలో రేషన్ సమాచారం
నేటి నుంచి బియ్యం పంపిణీకి శ్రీకారం
సర్వం సిద్ధం చేసిన అధికారులు
జిల్లాలో 1,87,002 రేషన్కార్డులు..
10.752 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు
పేరు రేషన్కార్డులు లబ్ధిదారులు బియ్యం అలాట్మెంట్
(మెట్రిక్ టన్నులు)
అంత్యోదయ 10,823 30,461 1136.415
తెల్ల రేషన్ కార్డులు 1,76,094 5,34,105 9613.890
అన్నపూర్ణ 85 91 2.550
మొత్తం 1,87,002 5,64,657 10,752.855


