ఆస్తి పన్ను చెల్లింపునకు రేపటి వరకు గడువు
జనగామ: జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను వందశాతం సాధించేందుకు అధికారులు వేగం పెంచారు. కలెక్టర్ సందీప్ సుకుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అన్ని విభాగాలు పన్నుల వేటలో నిమగ్నమయ్యాయి. తాజా డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం మొత్తం 15,847 అసెస్మెంట్లపై ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.6కోట్ల13లక్షల డిమాండ్ నమోదైంది. ఇందులో ప్రస్తుత డిమాండ్ రూ.3 కోట్ల70లక్షలు, పాత బకాయిల డిమాండ్ రూ.కోటి 35లక్షలు, పెనాల్టీలతో కలిపి వసూలు చేయాల్సిన మొత్తం భారీగానే ఉంది. పన్నుల కలెక్షన్ల కోసం ఇంకా ఒక్క రోజే మాత్రమే మిగిలి ఉంది.
రూ.3.71 కోట్ల వసూళ్లు
పురపాలికలో రూ.3 కోట్ల71లక్షల వసూళ్లు సాధించగా, ఇంకా రూ.2కోట్ల 42 లక్షల బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకు 60.47శాతం కలెక్షన్లు సాధించారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ విభాగంలో 53.12శాతం, నాన్రెసిడెన్షియల్లో 64.87 శాతం, మిక్స్డ్ విభాగంలో 74.28శాతం కలెక్షన్ పూర్తి చేశారు.
ఉదయం నుంచి రాత్రి వరకు వసూళ్ల వేట
కమిషనర్ మహేశ్వర్రెడ్డి సూచనలతో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది పన్నుల వసూళ్ల కోసం ఇంటింటికీ పరుగులు పెడుతున్నారు. కమర్షియల్, డొమెస్టిక్ రెండు విభాగాల్లోనూ ప్రత్యేక దృష్టి సారించి ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తూ 100శాతం వసూళ్ల లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రతి వార్డులో పెండింగ్ ఉన్న ప్రాపర్టీల జాబితా తయారు చేసి, డోర్ టు డోర్ వసూలు, నోటీసుల ఇష్యూ, డీఫాల్టర్లను గుర్తించే చర్యలు వేగవంతం చేశారు.
ప్రభుత్వ శాఖలపై ప్రత్యేక దృష్టి
అత్యంత కీలక అంశం గత కొన్నేళ్లుగా ప్రభుత్వ శాఖల పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉంది. ఈ శాఖలు చెల్లింపులు ఆలస్యం చేయడం వల్ల వసూళ్లపై గణనీయమైన ప్ర భావం పడుతోంది. దీనిని ప్రాధాన్యంగా తీసుకున్న కమిషనర్ మహేశ్వర్రెడ్డి స్వయంగా శాఖ లను సంప్రదిస్తూ, పెండింగ్ వివరాలను వివరిస్తూ వెంటనే చెల్లింపులు జరిపించాలని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ట్యాక్స్ వసూలు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయగా, ఆ శాఖల ఉన్నతాధికారులను సంప్రదించి త్వరగా బకాయిలు క్లియర్ చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ శాఖల బకాయిలు
మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, వసతి గృహాలు, పోలీస్ క్వార్టర్లు, విద్యుత్, అటవీ తదితర శాఖలు చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో అధికారులు ముందుకెళ్తున్నారు. మొత్తం రూ.88లక్షల27వేలు బకాయిలు ఉంది. ఆరోగ్య శాఖ, సివిల్ హాస్పిటల్ పరిధిలో ఆస్తులపై భారీ బకాయిలు రావాల్సి ఉండగా, పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్తోపాటు క్వార్టర్స్పై బకాయిలు ఉన్నాయి. విద్యుత్శాఖకు చెందిన క్వార్టర్స్పై పన్నులు పెండింగ్లో ఉన్నాయి. విద్యు త్, వ్యవసాయ మార్కెట్, సంబంధిత శాఖలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్, ఫారెస్ట్ ఆఫీస్, నర్సరీ వంటి కార్యాలయాలు, పాల కేంద్రాలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్, పోస్టాఫీస్ కలుపుకుని మొత్తం 81 ప్రభుత్వ శాఖలకు సంబంధించి పెండింగ్ బకాయిలు రావాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు ఇప్పటికే సంబంధిత శాఖలకు ఎంత బకాయి ఉందనే సమాచారం ఇచ్చారు.
సకాలంలో పన్నులు
చెల్లించండి
ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపాలిటీలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ప్రధాన ఆదాయ వనరు. ప్రతీ ఇంటి యజమాని, వ్యాపారవేత్త చెల్లించాల్సిందే. పెనాల్టీలు పెరగక ముందే పెండింగ్ క్లియర్ చేసుకోవాలి. వసూళ్ల డ్రైవ్ కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో కలెక్షన్ శాతం పెరుగుతుందనే నమ్మకం ఉంది.
– మహేశ్వర్రెడ్డి,
మున్సిపల్ కమిషనర్, జనగామ


