జనగామ: జనగామ నియోజకవర్గంలో నెలకొన్న రవాణా సమస్యలపై తక్షణం స్పందించి ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో మంత్రిని కలిసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. చేర్యాల నుంచి జనగామకు వెళ్లే బస్సు సర్వీసు గతంలో బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి, కొన్నె మీదుగా నడిపించారన్నారు. ప్రస్తుతం రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఆ బస్సును నిలిపివేశారన్నారు. కొన్నె నుంచి వీరన్నపేట వయా నాగిరెడ్డిపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణం చేసి, బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరినట్లు చెప్పారు. నాగిరెడ్డిపల్లి ప్రాంత విద్యార్థులు సిద్దిపేట జిల్లా చుంచునకోట హైస్కూల్కు వెళ్లి చదువు కోవడంతో లోకల్ నాన్ లోకల్ సమస్యలు ఎదుర్కొంటూ భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ నుంచి బచ్చన్నపేట వరకు మాత్రమే నడుస్తున్న బస్సును వట్టిపల్లి, సాల్వాపూర్, లింగంపల్లి, కొన్నె, ఇటికాలపల్లి, ప్రజ్ఞాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు విస్తరించాలని సూచించినట్లు తెలిపారు. జగద్గిరిగుట్ట నుంచి బచ్చన్నపేట వరకు నడుస్తున్న బస్సును ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటికాలపల్లి, రామచంద్రగూడెం, కొన్నె, లింగంపల్లి, సాల్వాపూర్, రాజపేట, యాదగిరిగుట్ట మార్గంగా విస్తరించా లని కోరినట్లు స్పష్టం చేశారు. బస్సు సర్వీసు సేవలకు సంబంధించి తక్షణమే చర్యలు తీసుకుంటా మని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్కు
ఎమ్మెల్యే పల్లా వినతి


