జనగామ: పట్టణంలోని గుండ్లగడ్డ కృష్ణబావి ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బంధువుల ఇంటికి వెళ్లిన కుటుంబాన్ని టార్గెట్గా చేసుకుని దొంగలు ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన గురువారం వెలుగు చూసింది. సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లగడ్డకు చెందిన ఇంటి యజమాని వెంకటసాయిలు, ఆయన భార్య రమ ఈ నెల 25వ తేదీన మహబూబాబాద్ జిల్లా మేఘరాజుపల్లిలో బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి వెళ్లారు. అదే రాత్రి సుమారు 2.30 గంటల సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్లో కనిపించిన గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ప్రధాన ద్వారం తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం బీరువాను ధ్వంసం చేసి అందులోని సుమారు 6 తులాల బంగారం, 10 తులాల వెండి, అలాగే రూ.25 వేల నగదు దొంగిలించి పరారయ్యాడు. గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో కాలనీవాసులు అనుమానంతో వెంకటసాయిలుకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని చూసేసరికి బీరువాలోని ఆభరణాలు, నగదు కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై భరత్తో కలిసి ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వేలిముద్ర నిపుణులు వచ్చి కీలక ఆధారాలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై భరత్ తెలిపారు.
6 తులాల బంగారం, 10 తులాల
వెండి, నగదు అపహరణ
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం


