● సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సేవల పునరుద్ధరణ
జనగామ: ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కంటి శుక్లాల ఉచిత శస్త్ర చికిత్సలు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మళ్లీ ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్, కంటి వైద్య నిపుణులు రాజలింగం ఆధ్వర్యంలో ఈ విభాగం యాక్టివ్గా పనిచేసేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ను ఆధునికీకరించడం, అవసరమైన పరికరాలను కొత్తగా సమకూర్చడం, శుభ్రత, సురక్షిత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయడం వంటి చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రాజలింగం బృందం స్వయంగా మూడు కంటి శుక్లాల శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల ప్రయోజనంగా ఉచితంగా అందిస్తున్న ఈ శస్త్ర చికిత్సలు ప్రతీ మంగళవారం, శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆసుపత్రి అందిస్తున్న నాణ్యమైన కంటి సేవలతో ప్రయోజనం పొందాలని కోరారు.


